హద్దుమీరి మద్యం విక్రయాలు

పశ్చిమగోదావరి, వేలేరుపాడు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ ఆదాయానికి గండిపడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా  సరిహద్దు గ్రామాలన్నీ   తెలంగాణాణ గ్రామాలకు ఆనుకుని ఉండటంతో దీనిని అవకాశంగా తీసుకుని మద్యం  వ్యాపారులు  యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు.



ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక  దశలవారీ మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే  ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త  ఎక్సైజ్‌ పాలసీ అమలవుతోంది. అయితే ఆశాఖ అధికారుల నిర్లక్ష్యంతో సర్కారు ఆశయానికి  తూట్లు పడుతున్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి విచ్చలవిడిగా అక్రమ మద్యం రవాణా అవుతున్నా, అరికట్టాల్సిన అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా  నామమాత్ర దాడులు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.